Telugu Gateway
Andhra Pradesh

పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?

పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?
X

అధికార వైసీపీపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మీ పదవుల కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల సంఘం, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. వైసీపీ నేతలు కండకావరంతో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కూడా.. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రత్యర్థుల ఇళ్లలో వైసీపీ నేతలు మద్యం పెడుతున్నారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మద్యం పెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయని తెలిపారు.

ఎవరో చెప్పినట్లు ఎక్సైజ్‌ పోలీసులు నేరుగా వాటర్‌ ట్యాంక్‌ వద్దకు ఎలా వెళ్లారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకు భయపడి సీసీకెమెరాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని, ఆలపాటి రాజాను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతల ఇళ్లలో మద్యం సీసాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తున్నారని, తెలంగాణ నుంచి లిక్కర్‌ తెప్పించుకుని వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారని బాబు ఆరోపించారు. రాజకీయం కోసం ఎంతటి అరాచకానికైనా తెగిస్తారని, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన దళిత మహిళను కొట్టారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ నేతలు ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలు నిర్వహించే తీరు ఇదేనా? అని మరోసారి ప్రశ్నించారు.

Next Story
Share it