కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి
కేంద్ర బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల బీమా లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఆ విధానంలో స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన నిధులు కేటాయించాలి.
రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతతో చూడటం మంచిది కాదు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదు. ఆన్లైన్లో విద్య పై జీఎస్టీ 18% చాలా ఎక్కువ. మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలి. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి.’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.