Telugu Gateway
Politics

ఎన్ఆర్ సీపై కేంద్రం కీలక ప్రకటన

ఎన్ఆర్ సీపై కేంద్రం కీలక ప్రకటన
X

గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ ఆర్ సీ ) వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. సోమవారం నాడు పార్లమెంట్ ను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కేంద్రం మంగళవారం నాడు ఎన్ఆర్ సీ అమలు పై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు ‘‘ ఇప్పటి వరకు ఎన్నార్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని లోక్‌సభలో విపక్షాలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నార్సీ చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీపై చర్చ జరగాలంటూ విపక్షాలు సోమవారం పట్టుబట్టాయి. ఈ రెండు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్‌ చర్చింబోమంటూ కాంగ్రెస్‌ పార్టీ సహా డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం శాఖ ఎన్నార్సీపై వివరణ ఇచ్చింది. ఎన్నార్సీ అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. సీఏఏ తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామంటూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో... ఆయన మాట మార్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నార్సీ అమలు చేయబోమని తెలిపారు.

Next Story
Share it