టపాసులు కాల్చొద్దు..కేజ్రీవాల్
ఢిల్లీ అంటే పొల్యూషన్. దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉండే ప్రాంతంగా ఢిల్లీ. అందుకే మరోసారి అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ఆ పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు. ఎవరూ నగరంలో టపాసులు కాల్చొద్దని..దీని బదులు స్వీట్లు పంచి పెట్టాలని సూచించారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు.
ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.