Telugu Gateway
Andhra Pradesh

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్

పవన్..బిజెపి ఇన్ ఛార్జిపై బొత్స ఫైర్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోదర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అసలు ఎవరు బిజెపితో కలుస్తామని చెప్పారని ఆయన ప్రశ్నించారు. బిజెపి ఇన్ చార్జి, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని..అసలు పవన్ ను బిజెపితో కలవమని ఎవరు చెప్పారు..వద్దని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని బొత్స ఆరోపించారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీకి దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. బొత్స సత్యనారాయణ ఆదివారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కూడా ఎన్డీయేతో కలిసి వెళ్తున్నామని ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుకు లబ్ధి చేయడం కోసమే రామోజీరావు ఈ కథనం రాయించారని ధ్వజమెత్తారు. ఈనాడు రామోజీరావుకు లేఖ కూడా రాశానని, ప్రజల చేత తిరస్కరించబడినా కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తాను అనని మాటలను పచ్చ పత్రికలు ఎలా రాస్తాయని తీవ్రంగా మండిపడ్డారు. రిజాయిండర్‌ను కూడా తప్పుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా ఏ స్థాయికి దిగజారిపోతున్నారో తెలుస్తోందని ఆయన దుయ్యబట్టారు.

వ్యక్తుల కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును రక్షించడానికి ఇలా చేయడం సరికాదని హితవు పలికారు. ఇంకోసారి మళ్లీ ఇలాంటి కుత్సిత భావంతో వార్తలు రాయొద్దన్నారు. తనను తాను మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌ వద్ద తప్పు చేసినట్లుగా ఉన్న ఆధారాలు సీజ్‌ చేశామని ఐటీ అధికారులు చెప్పారన్నారు. ‘యనమల రామకృష్ణుడు ఎవరిపై పరువు నష్టం దావా వేస్తారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉన్నారు’ అని మంత్రి ప్రశ్నించారు. రూ.2వేల కోట్ల పన్ను ఎగవేత ఆధారాలు దొరికాయని.. ఐటీ శాఖ స్పష్టంగా చెప్పిందన్నారు. ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీకి చెందిన వారివేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Next Story
Share it