ఏపీలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా ఒక్కొక్కటి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు ఒకటి. మొత్తంగా ఏపీలో కొత్తగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఏర్పాట్లు చేయనున్నారు.
వీటి పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసి, దానిని భవిష్యత్లో విస్తరించాలని సీఎం తెలిపారు. విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన హై ఎండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థల్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.