Telugu Gateway
Andhra Pradesh

కాబోయే సీఎం భారతి..జెసీ వివాదస్పద వ్యాఖ్యలు

కాబోయే సీఎం భారతి..జెసీ వివాదస్పద వ్యాఖ్యలు
X

అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రాజధాని మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని జగన్ సొంత వ్యవహారం కాదన్నారు. ‘ఇవాళ జగన్ సీఎం అయ్యారు.. రేపు భారతి కావొచ్చు’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సంవత్సరంలోపు భారతి సీఎం అవుతుందని జెసీ వ్యాఖ్యానించటం విశేషం. రాజధానిగా అమరావతే ఉండాలంటూ మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు మాజీ ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటి బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అమరావతిలో కేవలం కమ్మ వాళ్లే భూములు కొనలేదు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారు.

ఏడు నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్టవేశాడు. ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం సరికాదు. ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్‌ ఆర్థిక సాయం చేశాడు.. మన రక్తాన్ని పీల్చి జగన్‌.. కేసీఆర్‌కు రెట్టింపు చెల్లించాడు. రాజధానిని శ్మశానం అని మంత్రి బొత్స అన్నాడు. నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమేఅని జేసీ వ్యాఖ్యానించారు. రాజధాని ఉంటే అమరావతిలోనే ఉండాలన్నారు. రాజధాని సమస్య 29 గ్రామాలకు పరిమితం అయింది కాదన్నారు. రాష్ట్రం మొత్తానిది అని.ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి పోరాడాలన్నారు. ప్రభుత్వంలో భయం పుట్టించాలని అన్నారు. మహిళలపై దాడులు అమానుషం అన్నారు.

Next Story
Share it