Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు ముద్దులు ..ఇప్పుడు గుద్దులు

అప్పుడు ముద్దులు ..ఇప్పుడు గుద్దులు
X

జగన్ పై చంద్రబాబు విమర్శలు

అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతుల కు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన భార్య భువనేశ్వరితో కలసి సంఘీభావం ప్రకటించారు. ఓ రాజకీయ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనటం ఇదే తొలిసారి. భువనేశ్వరి కూడా రైతుల ఉద్యమానికి తాము పూర్తి అండగా ఉంటామని ప్రకటించారు. నూతన సంవత్సరం తొలి రోజు చంద్రబాబు అమరావతిలో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. మందడంలో రైతులను పరామర్శించిన బాబు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం రోజున ఆడపడుచులందరూ రోడ్డు మీద కూర్చున్నారు. మీరేమి తప్పు చేశారని 17రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిని తరలించే శక్తి ఎవరికీ లేదు. అందరం ఐక్యంగా పోరాటం‌ చేద్దాం’’అని పిలుపు ఇచ్చారు.

హైదరాబాదును ఆదర్శ రాజధానిగా అభివృద్ధి చేశానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో‌ కూడా మంచి రాజధాని నిర్మించాలనుకున్నానని చెప్పారు. రూ. 16వేల కోట్ల లోటు‌ బడ్జెట్‌తో.. కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చామన్నారు. అన్ని విధాలా అనుకూలం.. రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆనాడు అసెంబ్లీలో జగన్ కూడా రాజధానిగా అమరావతిని అంగీకరించి 30వేల ఎకరాలు అవసరం అన్నమాటను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న సీఎం.. ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, కేంద్రం రూ. 1500 కోట్లు ఇస్తే అభివృద్ధి పనులు‌ చేశామని చెప్పారు. జగన్ ఆరోజు ముద్దులు పెట్టారని... ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే అడ్డుకుంటారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.‌

జగన్ కాన్వాయ్‌కు మరో దారిలేదా? అని ప్రశ్నించారు. ముందు డమ్మీ కన్వాయ్ పంపి.. తర్వాత వస్తున్నారని, ఇంత పిరికివాడుగా.. భయంతో తిరుగుతున్నారని విమర్శించారు. జగన్ ఆకాశం‌ నుంచి ఏమైనా ఊడి పడ్డారా? పోలీసులకు ఎవరేంటో తెలియదా? అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించొద్దని హితవు పలికారు. అమరావతి కోసం ఉద్యమం చేయడానికి‌ ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రజల్లోనూ తప్పు ఉంది. తొలుత ప్రజావేదికను కూల్చివేస్తే మీరు మనకెందుకులే అనుకున్నారు. నా ఇళ్లు ముంచే ప్రయత్నం చేస్తే.. అది చంద్రబాబు సొంత గొడవ అనుకున్నారు. ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి మీకు ఆందోళన మొదలైంది. వద్దు వద్దు అంటే ఒక్కసారి అని మీరే అవకాశం ఇచ్చారు. ఓట్లు వేసి గెలిపించారు.. కుంపటి పెట్టుకున్నారు. మీరు తప్పు చేసి.. ఇప్పుడు నన్ను పోరాటం చేయమంటున్నారు. కరెంట్ తీగను పట్టుకోవద్దు అంటే వినలేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో.’’ అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it