Telugu Gateway
Andhra Pradesh

ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీకి భయం లేదు

ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీకి భయం లేదు
X

ఏపీలో జనసేన, బిజెపిలు పొత్తు కుదుర్చుకోవటంపై అధికార వైసీపీ స్పందించింది. తమపై విమర్శలు చేయటం వల్లే తాము ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఎవరితో పొత్తు లేకుండా తమ పార్టీ గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న విషయం గుర్తుంచుకోవావాలన్నారు. స్థిరత్వం లేని వ్యక్తిని బీజేపీ నమ్ముకుందని అంబటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని విమర్శించారు. పవన్‌ నిలకడలేని వ్యవహారాలను వామపక్షాలు గమనించాలని సూచించారు. సిద్ధాంతాలు లేక పీఆర్పీలా జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. పవన్‌ ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతూ.. ఒక్కొరకంగా ప్రభావితం అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతామంటే తమకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.

గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన పవన్‌కు.. ఇవాళ ఆ పార్టీ నేతలు ఫ్రెష్‌ లడ్డులు ఏమైనా పంపిందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా పవన్ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని అంబటి ప్రశ్నించారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణించాయని గుర్తుచేశారు. 2019లో మాత్రం టీడీపీతో పవన్‌ లాలుచీ ఒప్పందం చేసుకుని.. వామపక్షాలతో కలిసి పోటీ చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన పాలన చేస్తుంటే పవన్‌ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఓట్లు అడుగుతుందని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సాయం చేసేందుకే కూటమి కట్టారా అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కూటమలు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు.

Next Story
Share it