అల..వైకుంఠపురములో సెన్సార్ పూర్తి
సంక్రాంతి బరిలో నిలుస్తున్న కీలక సినిమాలు రెండూ సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. తొలుత సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పనులు ముగించుకోగా..శుక్రవారం నాడు అల..వైకుంఠపురములో సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమా కావటం ఒకెత్తు అయితే..ఈ సినిమాలో పాటలు దుమ్మురేపాయి. దీంతో అల..వైకుంఠపురములో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తొలుత ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇఫ్పుడు మాత్రం తేదీ లేకుండానే సెన్సార్ పూర్తి అయిన పోస్టర్ విడుదల చేసి..సంక్రాంతికి విడుదల అని మాత్రమే పేర్కొన్నారు. దీంతో విడుదల తేదీలు మారే అవకాశం ఉందని బలంగా విన్పిస్తోంది. సంక్రాంతికి భారీ సంబరాలతో మేం సిద్ధమవుతున్నాం. పండుగ సరదాల కోసం మేం మిమ్మల్ని మీ కుటుంబంతో సహా థియేటర్లకు ఆహ్వానిస్తున్నాం. డోన్ట్ మిస్’ అంటూ గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ సినిమా ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) జనవరి 6వ తేదీన యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది.