Telugu Gateway
Politics

దిశ హత్యపై పార్లమెంట్ లో ప్రకంపనలు

దిశ హత్యపై పార్లమెంట్ లో ప్రకంపనలు
X

హైదరాబాద్ లో దిశ రేప్, హత్య ఘటనపై సోమవారం నాడు పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతోపాటు..దేశంలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే వారికి అసలు భయం లేకుండా పోయిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే చట్ట సవరణ చేసి ఇలాంటి కేసుల్లో ఉన్నవారిని తక్షణమే శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజ్యసభతోపాటు లోక్ సభలోనూ ఇదే అంశంపై ప్రకంపనలు రేగాయి. కేవలం చట్టాలు చేయడం ద్వారా దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టలేమని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఇలాంటి హేయమైన నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అరాచకాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరించినపుడే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మరో ఎంపీ అమీ యాజ్నిక్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యవస్థలన్నీఒకే తాటిపైకి వచ్చినపుడే సామాజిక సంస్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలో సైతం దిశ ఘటనపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. లోక్ సభలో ఈ అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చట్టాలు తీసుకువచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

హైదరాబాద్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం కోర్టులు, చట్టాలతో న్యాయం జరగదు. కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాలి. ఈ పరిస్థితుల్లో మార్పునకు సమాజమంతా సమిష్టి కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు బోధించాలి. అందరి మైండ్‌సెట్‌ మారాలి. జాతీయ రహదారుల్లో మద్యం అమ్మకాలు తగ్గించాలని పలువురు సభ్యులుసూచించారు.‘ఈ దేశం మహిళలకు, చిన్నారులకు సురక్షితం కాదు. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్లే. వెంటనే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. దిశ హత్య కేసులో నలుగురిని డిసెంబరు 31లోగా ఉరి తీయాలి’ అని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it