Telugu Gateway
Telangana

ఆర్టీసీ సమ్మె ఆపేస్తున్నాం..రేపటి నుంచి విధుల్లోకి

ఆర్టీసీ సమ్మె ఆపేస్తున్నాం..రేపటి నుంచి విధుల్లోకి
X

ఆర్టీసీ జెఏసీ మరోసారి సమ్మె విరమణ ప్రకటన చేసింది. మంగళవారం నాటి నుంచి విధుల్లో చేరనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఈ సమ్మె ద్వారా సర్కారు గెలవలేదని..కార్మికులు ఓటమి చెందినట్లు కాదని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యనించారు. సోమవారం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులంతా మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని తెలిపిన ఆయన.. ఇందులో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు.

అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు మంగళవారం నుంచి విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప.. విధులను విడిచిపెట్టడానికి కాదని స్పష్టం చేశారు.

సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరుసటి రోజే సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు. తాజాగా జెఏసీ నేతల సంతకాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు.ఆర్టీసీ ఎండీకి కూడా జెఏసీ లేఖ రాసింది. తాము మంగళవారం నుంచి విధుల్లో చేరతామని తెలిపారు.

Next Story
Share it