జగన్ పై అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఓ మెంటల్ ఆస్పత్రి ఉంది. అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సీఎం జగన్ కుర్చీలో కూర్చోపెట్టినా ఆయన కంటే మంచి పాలన ఇస్తాడని అన్నారు. సీనియర్ నేతలు..అధికారులు ఉన్నా సీఎం జగన్ ఎవరి మాటా వినకుండా ఇష్టానుసారం పాలన చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి దయతో సీఎం అయ్యారని..మంచి పాలన ఇవ్వాల్సింది పోయి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన ఇప్పుడే కాదు..రాబోయే రోజుల్లో చేపట్టే ప్రజా సంబంధ సమస్యలపై పూర్తి సహకారం అందిస్తుందని..రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రశ్నించే వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పార్టీలను పక్కన పెట్టి అందరూ కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ విశాఖపట్నంలో తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’కు సంఘీభావం ప్రకటించిన టీడీపీ నేతలు అందులో పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడుతూనే అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో పెద్ద కలకలం చెలరేగింది. కరెంట్ షాక్ తో కొంత మందికి గాయాలు కావటంతో ఆయన సడన్ గా ప్రసంగాన్ని ఆపేశారు.