Telugu Gateway
Telangana

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు
X

ఆర్టీసి సమ్మె వ్యవహారంలో ప్రభుత్వం పరిష్కారం కంటే ప్రత్యామ్నాయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు కన్పిస్తోంది. కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలకు ఛాన్స్ లేకుండా సాధ్యమైనంత మేర బస్సులు తిప్పి..సమ్మె ప్రభావాన్ని పరిమితం చేసే చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా రవాణా శాఖ మంత్రి, అధికారులు బుధవారం నాడు చర్యలు ప్రారంభించారు. ఆర్టీసి బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరుగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్‌, డివిజనల్‌ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తిప్పుతున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల టికెట్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు.

ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో... షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్‌ షెడ్యూల్‌ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామన్నారు. ఇక ఆర్టీసీ బస్సులన్నింటా బస్‌పాస్‌లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌పాసులన్నీ అనుమతించాలని, బస్‌పాస్‌లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి అజయ్‌ పేర్కొన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ వివరించారు.

Next Story
Share it