Telugu Gateway
Politics

వైసీపీలో చేరిన జూపూడి..ఆకుల

వైసీపీలో చేరిన జూపూడి..ఆకుల
X

అధికార వైసీపీలోకి కొత్త చేరికలు. టీడీపీలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని..వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జూపూడి ప్రభాకర్ ఆకస్మాత్తుగా వైసీపీలో చేరికపోయారు. ఆయనకు సాక్ష్యాత్తూ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఓటమి తర్వాత కూడా అంటే నిన్న మొన్నటివరకూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జూపూడిని పార్టీలోకి చేర్చుకోవటంపై సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూపూడితో పాటు రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు మగళవారం నాడు వైసీపీలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేసుకున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు.

వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలుపుకున్నారు. ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పార్టీలో చేరా. మద్య నిషేధంపై గతంలో చాలా మంది హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నార’’ని అన్నారు. మంచి పరిపాలన రావాలని, ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్‌ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్‌ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని జూపూడి వ్యాఖ్యానించారు.

Next Story
Share it