రాయల్ వశిష్ఠ బోటు బయటకు
పాపికొండల అందాలు వీక్షించేందుకు వాళ్ళందరూ ఉత్సాహంగా బోటు ఎక్కారు. గోదావరి వరద ఉధృతి..సుడిగుండాలు ఆ పర్యాటకుల ప్రాణాలు తీశాయి. సరిగ్గా గత నెల 15న గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిస్ఠ బోటును అత్యంత కష్టంతో..ఎన్నో రోజులు శ్రమటోడ్చి మంగళవారం నాడు బయటకు తీశారు. ధర్మాడి సత్యం బృందం దీని కోసం తీవ్రంగా శ్రమించింది. ఇందుకు సహకరించిన వారు కూడా ఎంతో మంది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా..12 మంది గల్లంతు అయ్యారు. బోటు వెలికతీతతో మిగిలిన మృతదేహలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎట్టకేలకు బోటు బయటకు వచ్చింది.
అదీ 38 రోజుల తర్వాత. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మునిగిపోయిన బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు.