Telugu Gateway
Telangana

ఆర్టీసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ఆర్టీసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి
X

హైకోర్టు బుధవారం నాడు ఆర్టీసి కార్మికులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని స్పష్టం చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఈ పరిణామంతో కొంతలో కొంత ఊరట లభించినట్లు అయింది. ఆర్టీసి యాజమాన్యం కూడా వచ్చే సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు తెలిపింది.

సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఆర్టీసీ యాజమాన్యం కావాలనే తొక్కిపెట్టిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ దుర్మార్గానికి హైకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆర్టీసీపై ప్రభుత్వం వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని, నియంతృత్వ పోకడలు మానుకోవాలన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

Next Story
Share it