మోడీ విమానానికి పాక్ నో
జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో షాక్ కు గురైన పాకిస్తాన్ భారత్ పై తన అక్కసు వెళ్ళగక్కుతోంది. అంతర్జాతీయ సమాజంలో ఈ అంశాన్ని లేవనెత్తి భారత్ ను ఇరకాటంలోకి నెట్టాలనే పాక్ ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది పాక్. ఈ తరుణంలో భారత్ కు చెందిన వివిఐపిల విమానాలను తమ గగనతలంలో అనుమతించకుండా సంతృప్తి చెందుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ విమానానికి నో చెప్పిన పాక్..తాజాగా ప్రధాని మోడీ విషయంలోనూ అదే పని చేసింది. పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని నరేంద్రమోదీ విమానం వెళ్లడానికి అనుమతివ్వడంటూ భారత అధికారుల చేసిన విజ్ఞప్తిని పాకిస్తాన్ నో చెప్పింది.
సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళనున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రయాణించే ప్రత్యేక విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. ఇందుకు ముందుస్తుగా భారత అధికారులు పాక్ అనుమతి కోరారు. దీనిపై స్పందించిన పాక్ మోదీ విమానానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పాక్-భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించాయి. దీనిలో భాగంగానే గగనతల మార్గాల నుంచి భారత్ సర్వీసులను పాక్ నిషేధించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్వయంగా తెలిపినట్లు పాక్ అధికారులు ప్రకటించారు.