నల్లమలను కాపాడుకోవాలి
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్ర నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలు రాజకీయ పార్టీలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నల్లమలలో తవ్వకాలకు సంబంధించి ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు శేకర్ కమ్ముల స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది.
కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది కాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల కాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి.’ అని పేర్కొన్నారు. మరి కేంద్రం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి యురేనియం తవ్వకాలను ఆపేస్తుందా? లేక అలా ముందుకెళుతుందా అన్నది వేచిచూడాల్సిందే.