Telugu Gateway
Politics

కాశ్మీరీ అమ్మాయిలపై బిజెపి సీఎం వివాదస్పద వ్యాఖ్యలు

కాశ్మీరీ అమ్మాయిలపై బిజెపి సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
X

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయటం ద్వారా కేంద్రంలోని బిజెపి సర్కారు తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి ప్రశంసలు దక్కుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో పలచన అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే యూపీ బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఇక నుంచి భారతీయులు అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్ళి చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మహర్షి భగీరథ జయంత్యుత్సవాల్లో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బీహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు.

ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కాశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్‌ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కాశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారు’అని వ్యాఖ్యానించారు. హర్యానాలో భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ‘భేటీ బచావో భేటీ పఢావో’తో హర్యానాలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం తగ్గిందని అన్నారు.

Next Story
Share it