తెలుగుదేశం పార్టీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత చందు సాంబశివరావు రాజీనామా చేయగా..బుధవారంనాడు సిట్టింగ్ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు..పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి లోకేష్ కారణం అని వ్యాఖ్యానించారు. కనీస అర్హత లేని లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కేతో కలిసి చట్టసభల్లో కూర్చోడానికి లోకేష్కు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్ సవాల్ విసిరారు. లోకేష్ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్ సంస్థలా పార్టీ తయారైందని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మరికొంతమంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. అన్నం సతీష్ ప్రభాకర్ త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.