Telugu Gateway
Politics

వైసీపీ నేతలకు నారా లోకేష్ సవాల్

వైసీపీ నేతలకు నారా లోకేష్ సవాల్
X

అమరావతి వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కారు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శిస్తోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిని ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో 500 ఎకరాల భూమి కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వవర్గాలను ఉటంకిస్తూ ఈ స్టోరీ వచ్చింది. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ వార్తపై ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీకి సవాల్ విసిరారు. ‘వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు.

అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు బాలక్రిష్ణ. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.

Next Story
Share it