Telugu Gateway
Politics

అమిత్ షా వర్సెస్ అసదుద్దీన్

అమిత్ షా వర్సెస్ అసదుద్దీన్
X

లోక్ సభలో సోమవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీల మధ్య సంవాదం జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చేసిన బిల్లుకు ఆమోదం సందర్భంగా జరిగిన చర్చలో ఈ సంవాదం చోటుచేసుకుంది. ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు. ఆ మాటకు హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్‌ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్‌ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు.

దీనికి అమిత్‌ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. సభ నుంచి బయటికొచ్చిన అనంతరం ఓవైసీ ఓ పత్రికతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. జాతీయవాదులు, జాతివ్యతిరేకులు అని తేల్చేందుకు బీజేపీ దుకాణమేదైనా షురూ చేసిందా. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడేక్రమంలో హోమంత్రి అమిత్‌షా మావైపు వేలు చూపించి బెదిరించేయత్నం చేశారు. ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే. దేవుడు కాదు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడినికి ఆయన నిబంధనలు చదువుకుంటే మంచిది’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it