Telugu Gateway
Telangana

కాంగ్రెస్ కు మరో షాక్ తప్పదా!

కాంగ్రెస్ కు మరో షాక్ తప్పదా!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం కాగా...ఇప్పుడు మరికొంత మంది కూడా జంప్ అయ్యేలా కన్పిస్తున్నారు. ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బిజెపిలో చేరటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే ఆయన కూడా ఈ సస్పెన్స్ కు తెరదించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపినే అని వ్యాఖ్యానించి రాజగోపాల్ రెడ్డి కలకలం రేపారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయం ప్రకటించే అంశాన్ని వేగవంతం చేసినట్లే కన్పిస్తోంది.

కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయంగా పెద్దగా భవిష్యత్‌ లేదన్న అభిప్రాయంలో ఉన్న ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. బుధవారం నాటి సమావేశానికి హాజరైన ఆయన దగ్గరి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు కూడా బీజేపీలో చేరడానికి మొగ్గు చూపారని అంటున్నారు. గురువారం మరోమారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ కావాలని, ఈ అంశంపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేంద్రంలో అనూహ్యమైన మెజారిటీతో అధికారం దక్కించుకున్న బిజెపి సత్వరమే తెలంగాణ, ఏపీల్లో రాజకీయంగా బలపడేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తోంది.

Next Story
Share it