ఆర్టీసీ ఇక ప్రభుత్వానిదే...మీరంతా ప్రభుత్వ ఉద్యోగులే

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన ఆర్టీసి అప్పులు...ఆస్తులు..సమస్యలు అన్నీ ఇక నుంచి ప్రభుత్వానివే అని..సంస్ధ ఉద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని విషయాలు తనకు వదిలేయాలని జగన్ ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. జగన్ తోభేటీ అనంతరం సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు నేతలు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎంతోభేటీ అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ...‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం మా భుజం తట్టారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తొలి కేబినెట్లో అమలు చేయడం సంతోషం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి నిర్ణయం వెలుగులు నింపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55వేలమంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మా డిమాండ్లను ముఖ్యమంత్రి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు’ అని అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)ను తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు.