Telugu Gateway
Telangana

టీవీ9 నుంచి రవిప్రకాష్ పై వేటు

టీవీ9 నుంచి రవిప్రకాష్ పై వేటు
X

తెలుగు మీడియా రంగంలో కలకలం. టీవీ9 నుంచి ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్ పై వేటు పడింది. కొద్ది కాలం క్రితమే టీవీ9 యాజమాన్యం మారింది. అయినా సరే సీఈవోగా ఉన్న రవిప్రకాష్ కొత్త యాజమాన్యానికి పలు అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ఆరోపణ. ఇప్పుడు రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసుతో పాటు..టీవీ9కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ఆరోపణ. నూతన యాజమాన్యానికి కి తెలియకుండా నిధుల మళ్లించారంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కొత్త యాజమాన్యం ఓ సుదీర్ఘ ప్రకటనను కూడా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై Tv9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని Tv9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి.

ABCL కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ABCLలో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు 25న డబ్బు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ABCL యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ABCL కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ABCL యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ABCL డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ABCL సంస్థ అక్టోబర్ 23, 2018న ఓసారి, జనవరి 30, 2019న మరోసారి డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించి, ఆ తీర్మానాన్ని ABCL సంస్థ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ABCL డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు.

ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ABCLకు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ABCLలో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌అధికారులు ABCLలో కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను ఆమోదించారు.

ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త యాజమాన్యం చేతిలో 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి చట్టప్రకారం వారికే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నిర్వహణ బాధ్యతలను కొత్త యాజమాన్యం చేపట్టింది. సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో, సినీ నటుడు శొంఠినేని శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

Next Story
Share it