‘వర్మ’ సంచలన వ్యాఖ్యలు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేనపై స్పందించారు. జనసేనతో పోలిస్తే 18 సీట్లు సాధించిన ప్రజారాజ్యం బాహుబలి వంటిదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటు, అబద్దాలు, వైఎస్ జగన్, లోకేష్లే చంద్రబాబు దారుణ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో నిజం చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ కొంతమందికి నచ్చక సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని రామ్గోపాల్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
75 ఏళ్లు రాజుగా బతికిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటో అందరికి తెలియజేయాలనిపించి ఈ సినిమా తీసినట్లు వర్మ తెలిపారు. ఆయన మరణానికి కారణమైన వారే 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫొటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లడం పెద్ద వెన్నుపోటులా అనిపించిందన్నారు. తాను సినిమా తీస్తే చంద్రబాబు వివాదం చేశారన్నారు. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలైందని, కానీ ఇక్కడ సైకిల్ జోరువల్ల విడుదల చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సైకిల్కు పంక్చర్ అవ్వడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.