కె ఏ పాల్ పై కేసు
కె ఏ పాల్. ఏపీ రాజకీయాల్లో పెద్ద హంగామా చేసిన నేతగా మారిపోయారు. కానీ ఓట్లు మాత్రం కేవలం వందల సంఖ్యలోనే వచ్చాయి. చివరకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా బరిలో నిలిచన పాల్ పరిస్థితి కూడా అదే. అయితే ఇప్పుడు పాల్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పాల్తో పాటు అతని సహచరులు జ్యోతి, విజయ్లపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అమెరికా పంపిస్తానని కేఏ పాల్ మోసం చేశారంటూ రామచంద్రపురంకు చెందిన ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజిట్ వీసా స్పాన్సర్షిప్ లెటర్ అందజేస్తానని చెప్పి పాల్ బృందం తనను 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు సదురు మహిళ ఆరోపించారు. చివరకు తన దగ్గర నుంచి రెండు లక్షల రూపాయల చెక్కును తీసుకున్న పాల్ బృందం ఆ డబ్బును డ్రా చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత స్పాన్సర్షిప్ లెటర్ ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు పాల్, విజయ్, జ్యోతిలపై కేసు నమోదు చేశారు.