Telugu Gateway
Politics

‘అయ్యన్న’ వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం

‘అయ్యన్న’ వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం
X

అధికార తెలుగుదేశం పార్టీలో కాస్తో కూస్తో జోష్ నింపింది అంటే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ వివరాలే. కాకపోతే ఆ వివరాల వెల్లడిలో కూడా లగడపాటి చాలా కామెడీ చేశారు. నేను ఈవీఎంల్లోకి తొంగి చూడలేదు..నమ్మేవాళ్ళు నమ్మండి...లేదంటే లేదు అంటూ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తూ వివరాలు బహిర్గతం చేశారు. టీడీపీనే వంద సీట్లకుపైగా దక్కించుకుంటుందని తెలిపారు. ఎక్కువ జాతీయ ఛానల్స్ వైసీపీకే ఛాన్స్ ఉందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. టీడీపీకీ లగడపాటితో పాటు టుడేస్ చాణక్య వంటి మరికొన్ని సంస్థలు అనుకూల ఫలితాలను చూపించాయి. అయితే లగడపాటి అంచనాలతో తాత్కాలికంగా అయినా జోష్ లో ఉన్న టీడీపీ శ్రేణులను మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు షాక్ కు గురిచేశాయి. ఆయన లగడపాటి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్‌ పోల్‌ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయారని అయ్యన్నపాత్రుడు అన్నారు. స్వయంగా ఓ మంత్రే లగడపాటి ఎగ్జిట్ పోల్ కు ఏ మాత్రం విశ్వసనీయత లేదనేలా మాట్లాడటంతో అవాక్కు అవటం టీడీపీ నేతల వంతు అయింది. రెండు రోజుల్లోనే అసలు ఫలితాలు వస్తున్నప్పుడు ఈ హంగామా అవసరమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు.

Next Story
Share it