టీడీపీ ఎంపీపై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ పై కేసు నమోదు అయింది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న తన కోడలు రూపకు రెండు కోట్ల రూపాయల నగదు పంపుతుండగా..పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ డబ్బు ఎవరిది..ఎక్కడికి తీసుకెళుతున్నది స్పష్టంగా చెప్పటంతో ఈ కేసు నమోదు అయింది. బుధవారం సాయంత్రం హైటెక్సిటీ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మురళీమోహన్తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులు హైటెక్సిటీ రైల్వే స్టేషన్లో అనుమానస్పదంగా కనిపించారు.
దీంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 2 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా జయభేరి ఉద్యోగులు జగన్మోహన్, ధర్మరాజులు వారికి డబ్బు ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్ రాజమండ్రిలో ఎదురుచూస్తుంటారని కూడా పేర్కొన్నారు. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్, అక్కడి నుంచి గరీబ్రథ్ ట్రైన్లో రాజమండ్రికి తరలించేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 171(బీ), (సీ), (ఈ), (ఎఫ్) లకింద కేసు నమోదు చేశామ’ని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.