మోహన్ బాబుకు బెదిరింపు కాల్స్
ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఎన్నడూలేని రీతిలో అన్ని రకాలు గా ఇవి పీక్స్ కు చేరుతున్నాయి. ఆరోపణలు..ప్రత్యారోపణలు..విమర్శలు కొత్త పరాకాష్టలకు చేరుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీలో చేరుతున్న సినీ నటులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏపీకి సమస్యలు వచ్చినప్పుడు వీరంతా ఎక్కడకు పోయారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు బయటకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ తరుణంలో ఇటీవలే వైసీపీలో చేరిన సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మోహన్బాబు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ తరువాత ఆ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.