హైదరాబాద్ లో అఖిలపక్ష నేతల అరెస్ట్
ఇంటర్ బోర్డు వైఫల్యాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్న అఖిలపక్ష నేతలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపింది. కీలక నేతలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్త మ్ కుమార్ రెడ్డితోపాటు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు ఇతర నేతలు అందరినీ కట్టడి చేశారు. ఈ అఖిలపక్ష నిరసన కార్యక్రమానికి జనసేన కూడా మద్దతు ప్రకటించింది. కీలక నేతలు ఎవరూ బయటకు రాకపోయినా ఇంటర్ బోర్డు వద్ద మాత్రం ఉద్రికత్త నెలకొంది.
పోలీసులు భారీగా మొహరించి అక్కడ ధర్నాలు చేయటానికి వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. కొన్ని విద్యార్ధి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు కు చేరుగా...మరికొంత మంది సీఎం నివాసం ప్రగతి భవన్ వైపు వెళ్లారు. నగరంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి..ఎవరూ ధర్నాలకు దిగకుండా సర్కారు అడ్డుకుంటోంది. పలు చోట్ల పోలీసులకు , విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తంగా ఇంటర్ బోర్డ్ పరిసర ప్రాంతాలు మారాయి.