Telugu Gateway
Politics

ఇంత చిల్లర ప్రధానిని ఎన్నడూ చూడలేదు

ఇంత చిల్లర ప్రధానిని ఎన్నడూ చూడలేదు
X

ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ సీఎం కెసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంత చిల్లర ప్రధానిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఆదివారం నాడు నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వనరులను వాడుకునే తెలివితేటలు లేవుగాని..తన ముక్కు గురించి వాళ్లకెందుకు అని విమర్శించారు. సమాజాన్ని విభజించాలనే ఆలోచన బిజెపి వాళ్ళది. మేం హిందులం కాదా?.బిజెపి వాళ్లే హిందువులా?. నేను యాగం చేస్తే మోడీకి నొప్పేంటి. బిజెపి సిగ్గులేని, భావదారిద్ర్య పార్టీ అని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తేనే పాకిస్థాన్, హిందువులు, ముస్తింలు గుర్తొస్తారు అని విమర్శించారు. ఎన్నికల కోసమే బిజెపి ఇప్పుడు నిజామాబాద్ లో పసుపు బోర్డు నినాదాన్ని అందుకుందని ఎద్దేవా చేశారు.

పేదల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు. ఎక్కడ అవి.? నల్లధనం తెచ్చారా?. ఎవరూ అధికారులకు లంచాలు ఇవ్వొద్దు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని ప్రకటించారు. నెలా..రెండు నెలలు ఓపిక పట్టాలన్నారు. కులాల కుళ్ళు, మతాల చిచ్చు పెట్టేవారిని వెళ్లగొట్టాలి. దేశంలోని సమస్యల గురించి పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు చిల్లర విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిని పట్టుకుని చోర్ చోర్ అంటుంటే బిజెపి వాళ్లు కూడా అంతే విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. దేశంలో దేవాలయాలన్నీ బిజెపి వాళ్ళే కట్టించారా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ ఎంపీగా నగేష్ ను గెలిపించాలని కెసీఆర్ కోరారు.

Next Story
Share it