Telugu Gateway
Politics

పసుపు-కుంకుమపై ఆశలే అతి పెద్ద ఫెయిల్యూర్!

పసుపు-కుంకుమపై ఆశలే అతి పెద్ద ఫెయిల్యూర్!
X

ఐదేళ్ళ పాలన తర్వాత కూడా గెలుపునకు చివరి నిమిషంలో ప్రకటించిన ‘పసుపు-కుంకుమ’పై ఆధారపడటమే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అతి పెద్ద ఫెయిల్యూర్. మహిళలు భారీ ఎత్తున ఓటింగ్ కు వచ్చారు. వాళ్లంతా మాకే ఓటు వేశారు. మేమే గెలిచేస్తాం. ఇది తెలుగుదేశం నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అందరి ధీమా. అంటే ఐదేళ్ళలో చేసినవి..చెప్పుకోదగ్గవి ఏమీ లేక చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇఛ్చిన తాయిలాలు తప్ప..తమను గెలిపించేవి ఏమీ లేవని తెలుగుదేశం నేతలే అంగీకరిస్తున్నట్లు ఉంది ఆ వాదన. పసుపు-కుంకుమపై టీడీపీ అంతగా ఆశ పెట్టుకుంది అంటే ఆ పార్టీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చివరి నిమిషంలో పసుపు-కుంకుమ కింద మహిళలకు పది వేల రూపాయల ప్రజల సొమ్మును చంద్రబాబు పంచారు.

డ్వాక్రా మహిళలు ఐదేళ్ళ పాటు తమను సర్కారు నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి ఎడాపెడా ఓట్లు వేస్తారా?. అంటే అది జరిగే పనికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు...సమాచారం ఏదీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కన్పించటం లేదు. అందుకే టీడీపీ నేతలు అందరూ పసుపు-కుంకుమపై భారం వేసి ..అవే లెక్కలు వేసుకుంటూ ఆశల పల్లకీలో విహరిస్తున్నారు. ఐదేళ్ళ పాలన తర్వాత కూడా..ఎంతో సీనియర్ నేత అయిన చంద్రబాబు చివరి నిమిషం పథకాలపై ఆధారపడటమే అతి పెద్ద ఫెయిల్యూర్ అని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it