కాంగ్రెస్ ను వీడిన పొంగులేటి సుధాకర్ రెడ్డి
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఆదివారం నాడు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరస పెట్టి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వంతు వచ్చింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు కూడా చేశారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి ఎదురు కావడంతో పాటు, కాంగ్రెస్లో తగిన గుర్తింపు లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. ఇప్పటికే మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ...ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం విదితమే. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖమ్మం లోక్ సభ సీటు ఆశించిన ఆయనకు భంగపాటే ఎదురైంది. ఈ సీటును అధిష్టానం రేణుకా చౌదరికి కేటాయించిన సంగతి తెలిసిందే.