Telugu Gateway
Politics

టీడీపీకి మాగుంట గుడ్ బై

టీడీపీకి మాగుంట గుడ్ బై
X

తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు ముందు వరస షాక్ లు తగులుతున్నాయి. అధికార పార్టీ ఒంగోలు ఎంపీ సీటు కేటాయిస్తామన్నా వద్దని ఆయన వైసీపీలో చేరటానికి నిర్ణయించుకున్నారు. ఆయనే మాగుంట శ్రీనివాసుల రెడ్డి. గత కొంత కాలంగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఆయన తన నిర్ణయాన్ని గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు. మాగుంట నిర్ణయంతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలినట్లు అయింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపించారు.

ఆయన తన రాజీనామా లేఖను చంద్రబాబుకు కాకుండా కళా వెంకట్రావుకు పంపటం విశేషం. కళా వెంకట్రావును అధ్యక్షుడిగా గుర్తించి లేఖ పంపిన నేత కూడా బహుశా ఈయనే కావొచ్చు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. తమ కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో మాగుంట ఒంగోలు నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Next Story
Share it