Telugu Gateway
Politics

చంద్రబాబు స్పీచ్ కు ప్రజలెందుకు భయపడుతున్నారు?

చంద్రబాబు స్పీచ్ కు ప్రజలెందుకు భయపడుతున్నారు?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్పీచ్ అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?. ఇది భయమా? లేక విసుగా?. ఎందుకంటే చెప్పింది చెప్పటంలో చంద్రబాబు దిట్ట. అది ఆయనకు అవసరం కావొచ్చు. కానీ వినేవాళ్ళకు అది ఓ పెద్ద పరీక్షే. టీవీల్లో చంద్రబాబు స్పీచ్ వినేవాళ్లు కూడా ఆయన ఎప్పుడు ఏమి చెబుతారో చదువుకునే పిల్లల్లా పాఠంలా అప్పజెప్పగలరు?. ఎందుకంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు?. అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కాంగ్రెస్ వల్లే ఏపీకి తీరని అన్యాయం జరిగిందని..అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ధ్వజమెత్తారు. బిల్లులో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ధ్వజమెత్తారు. మోడీతో కలసి ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ,బిజెపిని వెనకేసుకు వచ్చారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయినా ప్రధాని మోడీపై ప్రజలు అప్పుడే తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ మట్టికుండలను కళ్లకు అద్దుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయనపై ద్వజమెత్తుతున్నారు.

ఇలా చంద్రబాబు ద్వంద ప్రమాణాలు..ఎప్పటికప్పుడు మాట మార్చటం ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇదొక్కటే కాదు..ప్రత్యేక హోదా మొదలుకుని పలు అంశాల్లో చంద్రబాబు మాట మార్చిన వైనాలు ఎన్నో. 2014 ఎన్నికల ముందు ఇఛ్చిన రైతు రుణ మాఫీ హామీ ఇప్పటివరకూ పూర్తి కాలేదు. కొత్తగా ఇప్పుడు మళ్లీ రైతు రక్ష పేరుతో నిధులు ఇస్తానని ఊరిస్తున్నారు. డ్వాక్రా మహిళల విషయంలోనూ అదే సీన్. కెసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారని..ఏకంగా ప్రజల సొమ్ము పది వేల కోట్ల రూపాయలను పసుపు-కుంకుమ పేరుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వటానికి రెడీ అయిపోయారు. దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉండి..ఇప్పుడు ఎన్నికల ముందు సమావేశాలు పెట్టి మళ్లీ అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం అంటూ ఊదరగొడుతున్నారు.

ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన బీసీ సభ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తొలుత సభకు జనం బాగానే వచ్చినా..చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే అంతా ‘పరార్’ అయ్యారు. ఓ వైపు ఎన్నికల వేళ అందరిపై ఎడాపెడా వరాలు కురిస్తున్నా చంద్రబాబు మాటలు వినటానికి ప్రజలు ఎందుకు సిద్దంగా లేరు?. కానీ అస్మదీయ మీడియా మాత్రం అహో..ఓహో అంటూ కీర్తిస్తూ..సూపర్ సక్సెస్ అని ప్రచారం చేస్తోంది. ఈ పరిణామాలు చూసి తెలుగుదేశం నేతలు..శ్రేణుల్లో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజల స్పందన చూస్తుంటే ‘ఎక్కడో తేడా కొడుతోంది’ అని చెబుతున్నారు. అది ఏంటో కానీ ఎన్నికలు అయితే కానీ తెలవదు. జయహో బీసీ సభలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీల వీడియో చూడండి.

https://www.facebook.com/telugu.gateway.5/videos/2249722478687593/

Next Story
Share it