పనులు జరిగేది ఇలాగేనా?
కాళేశ్వరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కెసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల సమస్య లేకపోయినా పనులు అనుకున్నంత స్పీడ్ లో సాగకపోవటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసీఆర్ మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనులపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కెసీఆర్ తొలుత మేడిగడ్డ చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు.
మార్చి 31లోగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎల్అండ్టీ అధికారులకు సీఎం సూచించారు. ఏప్రిల్ 15లోగా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి విన్నవించారు. మార్చి 15లోగా కరకట్ట పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రాజెక్ట్ ఉండాలని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. తర్వాత కెసీఆర్ కన్నేపల్లి పంప్హౌస్ నిర్మాణ పనులపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పంప్హౌస్లో భాగంగా 11 మోటర్లకు గాను ప్రస్తుతం నాలుగు బిగించినట్లు తెలిపారు. మార్చి 15 నాటికి మిగతా వాటిని బిగించి డ్రైరన్ నిర్వహిస్తామని వివరించారు. జూన్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని మోటార్లను బిగించి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు.