Telugu Gateway
Andhra Pradesh

ఫెడరల్ ఫ్రంట్ ను స్వాగతించిన జగన్

ఫెడరల్ ఫ్రంట్ ను స్వాగతించిన జగన్
X

కీలక పరిణామం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ల మధ్య బుధవారం నాడు హైదరాబాద్ లో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు కెటీఆర్ జగన్ తో చర్చలు జరిపారు. త్వరలోనే ఏపీలో కెసీఆర్ స్వయంగా జగన్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రాల హక్కుల సాధనకు కెసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ మంచి ప్రయత్న అని..దీన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కీలక భేటీ అనంతరం జగన్, కెటీఆర్ లు మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘కేసీఆర్‌ ఫోన్‌ చేసి చెప్పిన తర్వాత.. కేటీఆర్‌ వచ్చి నాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రాన్ని ఎదుర్కోవాలంటే.. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం గురించి చర్చించాం. ప్రత్యేక హోదా విషయమే పరిశీలిస్తే.. పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు.

ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరఫున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్‌ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తాం.’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కెటీఆర్ స్పందన ఆయన మాటల్లో...‘దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు రావాలని, ఏడాదిన్నర కాలం నుంచి మా అధినేత కేసీఆర్‌ కృషి చేస్తున్నారు.

ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌లతో పాటు మరికొంత మందిని కేసీఆర్‌ కలిసారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై మాట్లాడాలని కోరారు. ఇందులో భాగంగానే నేను వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యాను. తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పోరాడటంపై చర్చించాం. ఇవి ప్రాథమిక చర్చలే. త్వరలోనే కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌ను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై సమగ్రంగా చర్చిస్తారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. హోదాకు సంబంధించిన విషయంలో ఏపీకి మా పూర్తి మద్దతు ఉంటుంది.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story
Share it