హైదరాబాద్ లో పడుకుని చూసే సినిమా థియేటర్
ఒకప్పుడు హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్యా 70 ఎంఎం..దేవీ థియేటర్ లో సినిమా చూడటం అంటే అదో గొప్ప అనుభూతి. చాలా మంది అక్కడ మాత్రమే సినిమా చూసేవారు. కాలం మారింది. భాగ్యనగరంలో ఎన్నో కొత్త కొత్త థియేటర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్తదనం..విలాసవంతమైన సౌకర్యాలు జోడిస్తూ వస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ దాటేసి ఇప్పుడు అందరూ మల్టీఫ్లెక్స్ ల వైపు పరుగులు పెడుతున్నారు. నగరంలో చాలా మంది సినిమా టిక్కెట్ పై 150 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. హైదరాబాద్ లో వెలిసిన తొలి మల్టీఫ్లెక్స్ ప్రసాద్ ఐ మ్యాక్స్. ఆ తర్వాత ఇక వరస పెట్టి చాలా వచ్చేశాయి. ఇప్పుడు వాటన్నింటిని దలదన్నేలా సినీ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ ప్రేక్షకులకు కొత్త అనుభూతులు అందించేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం జంట నగరాల్లో అత్యంత ఖరీదైన..మల్టీఫ్లెక్స్ గా ఇది నిలవనుంది.
అదిరిపోయే హంగులతో ఏషియన్ సినిమాస్తో కలిసి మహేష్ బాబు హైదరాబాద్లోని గచ్చిబౌలీలో ర్మించిన ఏఎంబీ సినిమాస్ ఆదివారం ప్రారంభమైంది. మహేష్ తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ చేతులమీదుగా మహేష్ మల్టీప్లెక్స్ వైభవంగా ప్రారంభమైంది. మొత్తం ఏడు స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో 2.ఓ చిత్రం నేడు తొలి సినిమాగా ప్రదర్శితమవుతోంది. టికెట్ ధర రూ. 230 నుంచి ప్రారంభమవుతుంది. ఏఎంబీ సినిమాస్లో పడుకుని చిత్రాన్ని చూసే వెసులుబాటు ఉండటం విశేషం.