Telugu Gateway
Telangana

చంద్రబాబు నీచ రాజకీయవేత్త

చంద్రబాబు నీచ రాజకీయవేత్త
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ సీఎం కెసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో విమర్శలు చేశారు. చంద్రబాబును నీచ రాజకీయ నేత అని..వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఏపీ ప్రజలు దారుణ ఫలితాలు చూపిస్తారని హెచ్చరించారు. శనివారం నాడు కెసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ వైఖరి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. హోదా విషయంపై అవసరమైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఐదేండ్లవుతోంది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ సీఎం అయినా ప్రజలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలి. చంద్రబాబుకు మెదడు ఉందా? అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది.

ఏపీ హైకోర్టును ఆ రాష్ట్రానికి తరలించకున్నా హైదరాబాద్‌లోనే వేరుగా ఉంటే సరిపోతుందని మేం సుప్రీంకోర్టుకు విన్నవించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు మనుగడలోకి వస్తాయని సుప్రీంకోర్టు నెలన్నర క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టుకు చెప్పిన ప్రకారం ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌ వరకు అమరావతిలో ఎందుకు హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయలేదు. ఉమ్మడి హైకోర్టును సుప్రీంకోర్టు విభజిస్తే కేంద్రం నోటిఫై చేసింది. ఈ విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఎలా విమర్శలు చేస్తాడు. ఆయనంత చెత్త రాజకీయ నేత దేశంలోనే ఎవరూ లేరు. నవీన్‌ పట్నాయక్‌ను ఎందుకు కలిసినవు. మల్లయ్యను, ఎల్లయ్యను ఎందుకు కలిసినవు అని అడుగుతడు. నేను ఎవరిని కలిస్తే నీకెందుకు? నువ్వు (చంద్రబాబు) మోదీ సంకనాకుతావు.

సంకల కూచుంటవు. అకస్మాత్తుగా ఓ రోజు రాహుల్‌గాంధీ సంకనాకుతావు’అని కేసీఆర్‌ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ‘చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లేదు. ఇలాంటి నేతను భరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తదని ఆయనే వాదించిండు. అప్పట్లో రాహుల్‌గాంధీ విజయవాడకు వస్తుంటే.. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించిండు. ఇప్పుడు నరేంద్రమోదీ వస్తుంటే ఇదే మాట అంటున్నాడు. నీకో పాలసీ, పద్ధతి ఉందా. మనిషిలాగా మాట్లాడుతున్నావా? మీడియా ఇలాంటి డర్టీ లీడర్లను చీల్చి చెండాడాలి’అని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మిస్తున్నారని.. దేశంలోనే ఇదే మొదటిది అని పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు గొప్పగా చెప్పారు.

రాఫ్ట్‌ ఫౌండేషన్‌ టెక్నాలజీ కొత్తదేం కాదు. హైదరాబాద్‌లో వెయ్యికిపైగా ఇళ్లు ఇలాగే కట్టారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు ఇలాగే నిర్మిస్తారు. మిషన్‌ భగీరథ కింద నిర్మిస్తున్న 18 వేల ట్యాంకులు ఇలాగే నిర్మించాం. రేగడి నేలలో ఏ నిర్మాణమైనా ఈ విధానంలోనే నిర్మిస్తారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టు ఉన్న అన్ని భవనాలను ఇలాగే కట్టారు. ఏపీ సచివాలయం 56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీ 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సైతం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉంది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చింది. హైకోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్ల వేరుగా ఇచ్చింది. ఇవన్నీ ఏం చేశావు. నాకేశావా? ఇన్ని అబద్దాలా? ఇంత మోసమా? చంద్రబాబు అనే వ్యక్తి వాడుకుని వదిలేసే రకం.

హరికృష్ణ శవంపై పేలాలు ఎరుకునే ప్రయత్నం చేశాడు. ఆయన చావును సొమ్ము చేసుకునేందుకు హరికృష్ణ కూతురును బలవంతంగా పోటీకి పెట్టారు. ఆ అమ్మాయికి ఇప్పుడైనా ఏమైనా ఇస్తరా. చంద్రబాబు నీచంగా, రాక్షసంగా వ్యవహరిస్తడు’అని కేసీఆర్‌ మండిపడ్డారు. చంద్రబాబు కేంద్రం ఏమీ ఇవ్వలేదని అంటడు. మళ్లీ అభివృద్ధి పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేస్తడు. జనం ఏది నమ్మాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నేను వద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నడు. దీనిపై మా వైఖరి సుస్పష్టం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో మా ఎంపీ కవిత స్పష్టంగా చెప్పారు. నేనెందుకు వద్దంట. అవసరమైతే దీనిపై ప్రధానమంత్రి లేఖ రాస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 94 సెక్షన్‌లో 1, 2 సెక్షన్లలో దీనిపై స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలకు పరిశ్రమల రాయితీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. చంద్రబాబు వట్టి అబద్ధాల కోరు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇక్కడికి వచ్చి రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై అంచనాతో ప్రతిపాదనలు చేశారు. ప్రజా సంక్షేమం తెలియదు. అంతా అవినీతిమయం. నీకున్న ఈ జాఢ్యాల వల్లే ఇలా అయ్యింది. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నావు. అలా అంటే జైళ్లో వేస్తానన్నావు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతావు. నువ్వు దుర్మార్గుడివి. ఏమీ తెలియదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం. మామ పెట్టిన పార్టీని లాక్కుని మేనేజ్‌ చేస్తున్నావు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు పొలిటికల్‌ మేనేజర్‌. మేం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.

తెలంగాణ వచ్చేదాక విశ్రమించేదిలేదని అప్పటిదాకా పోరాడాం. నీలాగా చిల్లర రాజకీయాలు రావు. కేంద్రంలో బాబు చక్రాలు తిప్పలేదు. తిప్పితే ఆ అభివృద్ధి ఎక్కడ. మేనేజ్‌ చేసి పేపర్లలో ఏదో తిప్పినట్లుగా పత్రికల్లో ఫొటోలు వేసుకున్నారు. చంద్రబాబువి నకిలీ పనులు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని కాపీ కొట్టారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని అక్కడా అమలు చేస్తున్నారు. ఈవోడీపీ ర్యాంకుల ప్రతిపాదనలతో మేం పొరపాటున ఒక పదాన్ని తప్పుగా పెడితే దాన్ని కూడా ఒక్క అక్షరం మార్చకుండా అలాగే కేంద్రానికి సమర్పించారు. దీనిపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేశాం. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. చంద్రబాబుకు సిగ్గు లేదు. నోటికొచ్చింది మాట్లాడటమే.’ అంటూ ధ్వజమెత్తారు.

Next Story
Share it