కాంగ్రెస్ వస్తే మళ్ళీ అంథకారమే

తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ విద్యుత్ కోతలు తప్పవని..రాష్ట్రం అంథకారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ హెచ్చరించారు. ఎన్నికలు అంటే ప్రజలు గందరగోళ పడాల్సిన అవసరం లేదని..ఇందులో పెద్ద వింతలు కూడా ఏమీలేవని వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ పాలనను..నాలుగున్నర సంవత్సరాల పాలన పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమకు మరోసారి అధికారం అప్పగిస్తే మరింత మేలు చేస్తామని..తొలి సారి సమయం అంతా కొత్త రాష్ట్రం కావటంతో ప్లానింగ్ కే సరిపోయిందని అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, ప్రజలు తెలివైన తీర్పు ఇవ్వాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఆసిఫాబాద్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. జిల్లా అయింది కాబాట్టి ఆటోమేటిక్గా చాలా అభివృద్ది జరుగుతుందని అన్నారు.
ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, తెలంగాణలో జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్-టీడీపీలు ఒకవైపు... నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ మరోవైపు ఉందని, వాళ్ల పాలనలో కరెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వగలుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ను కట్టానంటున్న చంద్రబాబు కరెంట్ ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు.బిజెపి నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని..తెలంగాణలో అమలు అవుతున్న పేదలకు మేలు చేసే కార్యక్రమాలు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు.