Telugu Gateway
Telangana

టీడీపీలో ‘హాట్ సీట్’ గా కూకట్ పల్లి

టీడీపీలో ‘హాట్ సీట్’ గా కూకట్ పల్లి
X

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కూకట్ పల్లి ‘హాట్ సీట్’గా మారిపోయింది.ఇక్కడ నుంచి ఎవరు పోటీచేస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. తొలుత పెద్దిరెడ్డి పేరు ఖరారు అయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తర్వాత కూకట్ పల్లి కార్పొరేట్ మందాడి శ్రీనివాసరావుకే ఛాన్స్ ఉన్నట్లు భావించారు. కానీ అకస్మాత్తుగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సీటు నుంచి దివంగత పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దింపాలని ప్రతిపాదించారు. సుహాసిని గురువారం నాడు విశాఖపట్నంలో ఉన్న చంద్రబాబునాయుడితో భేటీ కావటంతో ఆమె కూకట్ పల్లి నుంచి పోటీ చేయటం ఖాయం అయిపోయినట్లే కన్పిస్తోంది. ఎన్నికల తేదీలు రాక ముందే ఇక్కడ నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ ను దించాలని ప్లాన్ చేశారు.

అందుకు కళ్యాణ్ రామ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు హరికృష్ణ కుమార్తెను రంగంలో దించుతుండటంతో ఈ పోటీకి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల ఆశీస్సులు ఉన్నాయా? లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లి నియోజవర్గంలో అత్యధికంగా సెటిలర్స్ ఉన్నారు. ఇక్కడ వీరి ఓట్లే కీలకం. సెటిలర్లు ఏ పార్టీపై మొగ్గుచూపుతారో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నారు. అందువల్ల సుహాసిని విజయం నల్లేరు మీద నడక అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Next Story
Share it