Telugu Gateway
Politics

ఒక కుటుంబం కోస‌మే తెలంగాణ వ‌చ్చిందా?

ఒక కుటుంబం కోస‌మే తెలంగాణ వ‌చ్చిందా?
X

ఒక కుంటుంబంతో తెలంగాణ వచ్చిందా? ఒక కుటుంబం కోసమే తెలంగాణ యువత బలిదానం చేసిందా? అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం నాడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బిజెపి ప్ర‌చార స‌భ‌లోమాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ స్వభావం ఒకటే అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల‌ది డ‌మ్మీ పోరాటం అని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు అంటే పాలు, పెరుగుల సంగమస్థలని అర్థం. అలాంటి ప్రాంతం ఇప్పుడు కరువుతో అల్లాడుతోంది. పాలమూరులో వలసలెందుకు పెరిగాయని గత పాలకులను ప్రశ్నించాలి. కృష్ణా, తుంగభద్ర ప్రవహించినా.. ఈ నేల ఎందుకు ఎండిపోతుంది? కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రెండు కుటుంబ పాలన పార్టీలే. గత నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో మీకిచ్చిన హామీలు నెరవేరాయా? అని మోడీ స‌భికుల‌ను అడిగారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నాయి. మరోసారి ఆ పార్టీలకు అధికారమిస్తే.. తెలంగాణ కోసం ఉద్యమించి బలిదానాలు చేసిన వారి శ్రమ వృథా అవుతుంది. తెలంగాణ అంధకారంలోనెట్టబడుతుంది. చంద్రబాబు, సోనియాగాంధీ సర్కార్‌లలో పనిచేసిన కేసీఆర్‌ వల్ల ఇలాంటి అభివృద్ధే జరుగుతుంది. తెలంగాణ మెట్రో.. కేంద్రం సాయం ద్వారానే పూర్తైంది. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే మన బతుకులు చీకటి మయమే. బీజేపీ హయాంలో ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.’ అని మోదీ విమ‌ర్శించారు. మోడీ మంగ‌ళ‌వారం నాడు తెలంగాణ‌లోని నిజామాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌భ‌ల్లో పాల్గొన్నారు.

Next Story
Share it