సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ట్వీట్
తెలుగుదేశం తరపున తెలంగాణలోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దిగటం ఆమె సోదరులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ తమ సోదరి సుహాసిని గెలుపునకు సహాకరించాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ట్విట్టర్ ద్వారా కోరారు. తన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఎంత పవిత్రమైనదని..తన తండ్రి సేవలందించి తెలుగుదేశం పార్టీ తరపున తన సోదరి ప్రస్తుతం బరిలోకి దిగుతున్నారని ఆమె విజయం చేకూరాలని కోరుకుంటూ కామెంట్ పోస్టు చేశారు. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుహాసిని తాత, దివంగత సీఎం ఎన్టీఆర్, తండ్రి నందమూరి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. బాబాయ్ నందమూరి బాలకృష్ల, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తొలుత ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లిన ఆమె.. అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. తనకు తెలుగు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు.
శనివారం ఉదయం 11.21నిమిషాలకు నామినేషన్ వేశారు.బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి ఆడపడుచు సుహాసిని గెలుపు కోసం యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. తమ ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారని, తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో, రోడ్షోల్లో పాల్గొంటానన్నారు. ఈ నెల 26 నుంచి ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు బాలయ్య.