Telugu Gateway
Politics

మోడీపై రాహుల్ మరో బాంబు

మోడీపై రాహుల్ మరో బాంబు
X

రాఫెల్ డీల్ ప్రధాని నరేంద్రమోడీ మెడకు చుట్టుకోవటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తే కనక మోడీకి నిద్రలేని రాత్రులు ఉంటాయని..దీనికి తనది గ్యారంటీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాఫెల్ డీల్ కు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీ భూమి కొనుగోలు చేసేందుకు అవసరమైన 284 కోట్ల రూపాయలను కూడా డసో ఏవియేషన్ సంస్థే రిలయన్స్ ఖాతాలో జమ చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించి మీడియా సంస్థలు పరిశోధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. హెచ్ఏఎల్ కు భూమి లేదని..కానీ రిలయన్స్ సంస్థకు భూమి ఉందనే కారణంతోనే ఆఫ్ సెట్ కాంట్రాక్ట్ ఇచ్చామని చెబుతున్నారని..మోడీని రక్షించేందుకే డసో కంపెనీ ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు.

డసో ఇచ్చిన డబ్బుతోనే రిలయన్స్ భూమి కొనుగోలు చేసిందని..నష్టాల్లో ఉన్న రిలయన్స్ కంపెనీలో డసో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. ఇదంతా మోడీ కోసమే జరిగిందని అన్నారు. రాఫెల్ స్కాం వెనక ఉన్నది ఇద్దరే ఇద్దరు అని..అందులో ఒకరు ప్రధాని మోడీ అయితే..మరొకరు అనిల్ అంబానీ అని ఆరోపించారు. రక్షణ శాఖకు కూడా సంబంధం లేకుండానే మోడీ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాఫెల్ అంశాన్ని రాహుల్ గాంధీ ఏ మాత్రం వదలకుండా ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇదే కీలక అంశంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it