అమెరికాలో కాల్పులు..12 మంది మృతి
కాల్పులు మరోసారి అమెరికాను వణికించాయి. ఓ బార్ లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారు. కాల్నిఫోర్నియాలోని థౌజండ్స్ ఓక్స్ దగ్గర ఉన్న ఓ బార్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో పోలీస్ అధికారి, గన్మెన్ సహా మొత్తం 12 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పబ్లోకి చొచ్చుకువచ్చిన దుండగుడు తొలుత హ్యాండ్గన్తో పలుమార్లు కాల్పులు జరిపిన తర్వాత పొగబాంబులు విసిరి మరోసారి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
నిందితుడు 30 సార్లు కాల్పులు జరిపాడని, బార్ నుంచి అందరూ చెల్లాచెదురైన తర్వాత సైతం తనకు కాల్పుల శబ్ధం వినిపించిందని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. దుండగుడి కాల్పుల ఘటనపై స్ధానిక అగ్నిమాపక విభాగం ట్వీట్ చేసింది. ఘటనా ప్రదేశానికి ప్రజలు దూరంగా ఉండాలని, పలువురికి తీవ్రగాయాలయ్యాయని, పెద్దసంఖ్యలో అంబులెన్స్ లు అవసరమని పేర్కొంది. కాల్పుల కలకలం చోటుచేసుకున్న సమయంలో బోర్డర్లైన్ బార్లో పెద్దసంఖ్యలో యువకులున్నారని, ఘటన నేపథ్యంలో ఒకరిని ఒకరు గుర్తించిన అనంతరం హగ్ చేసుకుంటూ కనిపించిన వీడియోను ఓ రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.