చంద్రబాబు పద్దతి మార్చుకోవాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని అన్నారు. ఆరోపణలపై చంద్రబాబు క్లీన్ గా బయటికి రావాలన్నారు. తప్పులు చేసి డొంకలో దాక్కుంటే పిడుగు పాటు తప్పదని హెచ్చరించారు. అవినీతిపై తాను ఇప్పుడే మాట్లాడటం లేదని..గతంలో కూడా ఈ విషయంలో చంద్రబాబును హెచ్చరించానని తెలిపారు. ఎక్కడ మీరు చెప్పిన ఉద్యోగాలు అని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలు చేసి సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న దోపిడీలు..దారుణాలపై చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో భూములు లాక్కుని రైతులను కష్టాల పాలు చేస్తున్నారని విమర్శించారు.జనసేన భవన నిర్మాణానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి
ఇవ్వలేదని ఆరోపించారు. జనసేన ఎప్పుడూ టీడీపీ పల్లకీ మోస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద నిర్వహించిన కవాతు..బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయని లోకేష్ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారని జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
లోకేష్ను సీఎం చేయడానికేనా? తను జనసేన పార్టీ పెట్టిందని ప్రశ్నించారు. తను మాట్లాడితే సినిమా నటుడుంటున్నారని, మరి లోకేశ్కు ఎం తెలుసని నిలదీశారు. నిరుద్యోగ సమస్యతో యువత రగిలిపోతున్నారని, ఉద్యోగాల హామీ ఏమైంది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని చెబుతున్నారని, అవి జన్మ భూమి కమిటీలా? లేక గూండా కమిటీలా? అని మండిపడ్డారు.
తను చంద్రబాబుకు మద్దతిస్తే.. ఆయన మాత్రం తనను, తన తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లోనే తమకు బలం ఉందని, ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయలేక పోటీ చేయలేదన్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చినా పదువులు అడగలేదన్నారు. రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలనే చంద్రబాబును కోరానని తెలిపారు. సంతలో పశువుల్లా ప్రతిపక్షనేతలను అధికార పార్టీలు కొంటున్నాయని మండిపడ్డారు. జనసేన సైనికులతో ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం చేస్తూనే ఉంటామని
ప్రకటించారు. సీఎం పదవి తనకు అలంకారం కాదని..లోకేష్ లా వారసత్వం కాదని అన్నారు. ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాలేడా? అని ప్రశ్నించారు. వారసత్వాలతో సీఎంలు కాలేరన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు.