ఎన్డీటీవీపై రిలయన్స్ పది వేల కోట్ల దావా
రాఫెల్ వ్యవహారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్ తాజాగా ఎన్డీటివీపై పది వేల కోట్ల దావా వేసింది. అహ్మదాబాద్ కోర్టులో ఈ దావా వేశారు. ఇది ఈ నెల 26న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వివాదంలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ దావా వేసింది. రాఫెల్ డీల్కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని రిలయన్స్ ఆరోపిస్తోంది.
ఎన్డీటీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం ‘ట్రూత్ వెర్సస్ హైప్స్’పై ఈ కేసు ఫైల్ చేసింది. అయితే దీనిపై ఎన్డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. తాజాగా ఈడీ కూడా ఎన్డీటీవీకి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల వివరాలను దాచిపెట్టారని ఈడీ ఆరోపిస్తోంది.