మొబైల్..బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరికాదు
‘ఆధార్’కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. మొబైల్ ఫోన్ కనెక్షన్లకు..బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరికాదని తేల్చిచెప్పింది. అయితే పాన్ కార్డుకు..ఆదాయ పన్ను దాఖలుకు మాత్రం తప్పనసరి అని పేర్కొంది. సుదీర్ఘ వాదనలు అనంతరం సుప్రీంకోర్టు ఆధార్ చట్టబద్ధతకు సంబంధించి పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు విధానం రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది. ఈ కార్డుతో పేదలకు ప్రత్యేక గుర్తింపు కార్డు దక్కినట్లు అయిందని పేర్కొన్నారు. ఒక కార్డు ఉన్న వ్యక్తి మరో కార్డు పొందటం సాధ్యం కాదని పేర్కొంది.
ఆధార్పై తొలి తీర్పును జస్టిస్ ఏకే సిక్రీ, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ చదివి వినిపించారు. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే, ఆధార్ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్ సేవలను తీసుకొచ్చారని, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్ ఒక గుర్తింపని చెప్పారు. ఆధార్ తీర్పు సందర్భంగా కోర్టు వ్యక్తం చేసినన అభిప్రాయాలు. ఆధార్ డేటాను హ్యాకింగ్ చేశారనే వార్తలు సరికాదని ప్రభుత్వం నివేదించినట్లు కోర్టు తెలిపింది.
వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్ అవరోధం కాదు
ఆధార్ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి
ప్రభుత్వ సంస్థలు ఆధార్ డేటా షేర్ చేసేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి
ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటా ఇవ్వడం కుదరదు
ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలి
సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి
టెలికాం కంపెనీలు ఆధార్ అడగవద్దు
బ్యాంక్ సేవలకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదు
స్కూల్ అడ్మినిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదు
పాన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులకు మాత్రం ఆధార్ తప్పనిసరి